మే 4న బెంగాల్‌లో మిఠాయిలు పంచుతాం: ప్రధాని నరేంద్రమోదీ

  • బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి తాను బెంగాల్ వస్తానన్న మోదీ
  • దేశ ప్రజలే తన కుటుంబమని వెల్లడి
  • టీఎంసీ హయాంలో నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శలు
మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రమంతా మిఠాయిలు పంచుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తాను తిరిగి బెంగాల్ వస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో నేడు బారక్‌పూర్‌లో ఏర్పాటు చేసిన చివరి ర్యాలీలో మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఉత్సాహంతో తాను ఢిల్లీకి వెళుతున్నానని అన్నారు.

తాను హెలిప్యాడ్ దిగి వస్తుంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారని తెలిపారు. తనను ఆశీర్వదించడానికి ఇంతమంది ప్రజలు వస్తారని ఊహించలేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరిన తర్వాత ఒక కార్యకర్తగా పార్టీ ఏది చేయమన్నా అది చేశానని అన్నారు. తనకు ప్రత్యేకంగా ఒక కుటుంబం అంటూ లేదని, దేశ ప్రజలే తన కుటుంబమని వ్యాఖ్యానించారు.

గత నాలుగు దశాబ్దాలుగా తాను దేశంలోని ప్రతి ప్రాంతంలో పర్యటిస్తున్నానని మోదీ అన్నారు. ఈ రోడ్డు షోలే తనకు పుణ్యయాత్రలని వ్యాఖ్యానించారు. నాడు టీఎంసీ అధికారంలోకి రావడానికి కారణమైన 'మా-మాటి-మనుష్' నినాదాన్ని వారు వదిలివేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో వారు ఒక్కసారి కూడా ఈ నినాదాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

ఆ పార్టీ నేతలు రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి దూషణలు, బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీఎంసీ పాలనలో మహిళలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు జరిగాయని మండిపడ్డారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే నిందితులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ అన్నారు.

will return during oath taking ceremony says PM Modi
PM Narendra Modi
oath taking ceremony

More Telugu News